Pages

Sunday 28 August 2011

రైతు సమస్యలపై దేశవ్యాప్త ఉద్యమం!

                                                                          
చాప కిందకి నీళ్ళు వస్తే తప్ప కేంద్ర ప్రభుత్వం స్పందించే పరిస్థితి కనిపించడం లేదని ఆర్.ఎల్.డి.అధ్యక్షుడు అజిత్ సింగ్ అభిప్రాయపడుతున్నారు. మొట్టమొదట సారిగా ఆంధ్రాలో రైతులు సమ్మె చేయడం చూశామని, ఇది జాతీయ స్థాయి ఉద్యమానికి నాంది పలుకుతుందని ఆయన అన్నారు. పంట విరామం ప్రకటించిన తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించి వచ్చిన ఆయన తర్వాత డిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రాలో రైతుల పరిస్థితి  దారుణంగా ఉందన్నారు. గత ఏడాది కాలంలో డీజిల్ ధర 40 శాతం, కూలి ఖర్చులు 35  శాతం, ఎరువుల ధరలు 30 శాతం వరకు పెరిగాయని గుర్తు చేస్తూ, అదే స్థాయిలో పంటలకు గిట్టుబాటు ధరలు కూడా ప్రకటించడం లేదని విమర్శించారు. దెబ్బతిన్న పంటలకు ఎకరాకు 25 వేల రూపాయల పరిహారం ఇవ్వాలని  "హూడా" కమిటీ సూచించినా  ప్రభుత్వం కేవలం 5 వేలు మాత్రమే చెల్లిస్తుండటం బాధాకరమన్నారు. జనతాదళ్ (ఎస్) ప్రధాన కార్యదర్శిడానిష్ అలీ, ఆరేస్పీ నేత అబనీరాయ్, సి.పి.ఎం.ఎంపీ రామచంద్ర డొమ్, బీ.జే.డి నేత సిద్దార్ధ మహాపాత్రో, తెలుగుదేశం నేత  మైసూరా రెడ్డి లు ఈ అఖిలపక్ష పర్యటనలో పాల్గొన్నారు. రైతుల  జీవితాలతో ఆడుకుంటున్న కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిపించేందుకు తెలుగుదేశం సహా తొమ్మిది పార్టీలు కలసికట్టుగా జాతీయ స్థాయి ఉద్యమం చేపడతామని  అజిత్ సింగ్ ఈ సందర్భంగా హెచ్చరించారు. దేశంలో రాజకీయ పార్టీలన్నీ పెంచి పోషించిన రైతు వ్యతిరేక ధోరణి వల్ల వ్యవసాయం పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యింది. దీనిపై పార్టీలకు అతీతంగా రైతులు సంఘటితంగా పోరాడితే తప్ప పాలకులు కళ్ళు తెరవరు. అది సాధించాలంటే రైతులు ఒక్కటిగా ముందుకు కదలాలి.

No comments: