Pages

Friday 26 August 2011

ఆంధ్రప్రదేశ్ లోయూరియా కొరత-రోడ్డెక్కిన రైతులు

                                                           
ఎరువుల కొరతతో రాష్ట్ర రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నెలలో వర్షాలు బాగా కురవడంతో నాట్లు పూర్తి స్థాయిలో పడటం వల్ల యూరియా అందుబాటులో లేక రైతుకు దిక్కుతోచడం లేదు. దేశీయంగా యూరియా గిరాకీ ౩ కోట్ల టన్నులైతే ఉత్పత్తి 210 లక్షల టన్నులు మాత్రమే. ఈ ఏడాది ఖరీఫ్ లో రాష్ట్రానికి సుమారు 17 లక్షల  టన్నుల యూరియా అవసరమైతే అందులో కేవలం 13 శాతం అంటే 2 .22 లక్షల టన్నులు మాత్రమే రాష్ట్రానికి దక్కాయి. అన్ని రకాల ఎరువులూ కలిపి 44 లక్షల టన్నుల దాకా కావాలన్న వ్యవసాయాధికారుల లెక్కలను ఎవరూ పట్టించుకోలేదు. అత్యవసర నిల్వల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. కనీసం ఇవి కూడా లేకపోవడంతో రైతులకు యూరియా అస్సలు అందటంలేదు. కేంద్రం కేటాయించే అన్ని రకాల ఎరువుల్లో ౩౦ శాతాన్ని మార్క్ ఫెడ్ కు ఇచ్చి నిల్వ చేయాలన్న ఉత్తర్వులను ఈ సీజన్లో తుంగలో తొక్కారు. ఈ నేపధ్యంలో ఎరువుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ధర్నాలకు దిగుతున్నారు. 
                                                           
  ఇప్పటికే పెరిగిన ఎరువుల ధరలతో రైతుకు సేద్యం గిట్టుబాటు కాక అవస్థ పడుతుంటే వాటి అందుబాటు కూడా ప్రశ్నార్ధకం కావడం దారుణం. లక్షా 20 వేల కోట్ల రూపాయలకు చేరిన ఎరువుల సబ్సిడీ భారాన్ని తగ్గించుకునేందుకు కేంద్రం పోషకాధార రాయితీ ఎరువుల విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో గతేడాది ఏప్రిల్ నుంచి యూరియా మినహా ఇతర ఎరువులు అన్నింటిపై కేంద్రం నియంత్రణ ఎత్తివేసినట్లయింది. ఫలితంగా ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చి ఎరువుల కంపెనీల మధ్య పోటీ పెరిగి ధరలు అందుబాటులో ఉంటాయని కేంద్రం నమ్మబలికింది. దీనికి భిన్నంగా ధరలు పెరగటంతోపాటు ఎరువులను అందుబాటులో ఉంచలేకపోవడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనంగా నిలిచింది. రైతుల కోసం ఇన్ని నీతులు చెబుతున్న పాలకులు ఇప్పుడేమంటారు..?

No comments: