Pages

Wednesday 24 August 2011

ఆహారశుద్ధి రంగంలో భారత్ వెనుకంజ!


                                                                      
ఆహారశుద్ధి రంగంలో భారత్ అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలతో పోల్చితే చాలా వెనుకబడి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ రంగంలో ఉన్న ఉజ్వలమైన భవిష్యత్తును అంచనా వేయగలుగుతున్న మన ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోలేకపోతోంది. ప్రపంచ పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్న మన దేశం, వాటిని ప్రాసెస్ చేసి ఎగుమతి చేసే విషయంలో మాత్రం అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతోంది.ఒక అంచనా ప్రకారం ప్రపంచ ఆహారశుద్ధి ఉత్పత్తులలో మన దేశ వాటా 2 శాతానికి మించ లేదు. ఒక్క పామాయిల్ నుంచే మలేసియా దాదాపు 40 రకాల ఉప ఉత్పత్తులను తయారు చేస్తోంది. ప్రపంచ పామాయిల్ విస్తీర్ణంలో ప్రముఖ స్థానంలో ఉన్న మనదేశం మాత్రం ఇంకా స్వయం సమృద్ధిని సాధించలేకపోయింది. 
తాజాగా దేశంలో ఆహారశుద్ధి రంగం ఆశించిన రీతిలో వృద్ధి చెందలేదని, పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వ్యవసాయంపై పార్లమెంటరీ కమిటీ వెల్లడించింది. శుద్ధి, నిల్వ సదుపాయాలూ సక్రమంగా లేకపోవడంతో దేశంలో సాలుసరి మొత్తం ఉత్పత్తిలో 50 శాతంగా  ఉన్న దాదాపు రూ. 50 వేల కోట్ల విలువైన పండ్లు, కూరగాయలు వృధా అవుతున్నాయని కమిటీ తెలిపింది. దేశంలో రెండు దశాబ్దాల నుంచే ఆహార శుద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉన్నప్పటికీ, ఈ రంగంలో ఆశించిన పురోగతి లేకపోవడం పట్ల కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. 
                                                                              
మన రాష్ట్రంలో కిలో టమాటోలు పావలాకి పడిపోవడం, ఒక్కోసారి పాతిక రూపాయల ధర పలకడం తెలిసిందే. ఆహార శుద్ధి పరిశ్రమలు తగినంతగా ఏర్పడితే రైతులకు ఇలాంటి పరిస్థితి ఉత్పన్నం కాదు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మేల్కొని ఈ రంగంలో అపార అవకాశాలను సద్వినియోగం చేసుకోగలిగితే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు ఎంతో మెరుగు పడతాయి. రైతులకు సైతం మంచి ధరలు దక్కుతాయి.

No comments: