Pages

Sunday 21 August 2011

అప్పుల్లో రాష్ట్ర రైతు!

                                                            
ఇతర రాష్ట్రాలతో పోల్చితే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతుల సంఖ్య ఆంధ్ర ప్రదేశ్ లోనే అధికంగా ఉందని ప్రణాళికా సంఘం భావిస్తోంది. వ్యవసాయరంగానికి ఇస్తున్న పంట రుణాల్లో సంస్థాగత రుణాల వాటా తక్కువగా ఉండి., వడ్డీ వ్యాపారులు ఇచ్చే రుణాల శాతం అధికంగా ఉండటాన్ని ప్రణాళికా సంఘం ఈ సందర్భంగా ప్రస్తావించింది. రుణ మాఫీతో రైతుల అప్పులు గణనీయంగా తగ్గాయని మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తుండటం గమనార్హం. బ్యాంకులు సక్రమంగా రుణాలు ఇవ్వకపోవడం, పుస్తక సర్దుబాట్లతో రైతులకు రుణాలు ఇస్తున్నట్టు బ్యాంకులు చెబుతున్న లెక్కలనే విశ్వసించి, రైతులకు విరివిగా పంట రుణాలు అందిస్తున్నామంటున్న రాష్ట్ర సర్కారు వాదనల్ని ప్రణాళికా సంఘం నమ్మటం లేదు. ఈ కారణాల వల్లనే ఆంధ్ర ప్రదేశ్ రైతులు దేశంలోని ఇతర రాష్ట్రాల రైతుల కంటే అప్పుల పాలయ్యారని ప్రణాళికా సంఘం బలంగా నమ్ముతోంది. వీటికి తోడు పంటల బీమా ప్రయోజనాలు అతి తక్కువ మంది రైతులకే  అందుతుండటాన్నిప్రస్తావిస్తూ, ఎక్కువ మంది రైతులకు వర్తింప చేయడంలో ఎదురవుతున్న లోపాలను ప్రభుత్వం సరిదిద్దటంలో విఫలమైందని ప్రణాళికా సంఘం భావిస్తోంది. 
వ్యవసాయానికి ఇస్తున్న రుణాల్లో 53 శాతం వడ్డీవ్యాపారుల నుంచే రైతులకు అందుతున్నట్టు నాబార్డ్ 
టాస్క్ ఫోర్సు ఇటీవలే తన అధ్యయనంలో తేల్చింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు జాతీయ స్థాయిలో 48 .5 శాతం మంది ఉంటే, ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే 82 శాతంగా ఉందని ప్రణాళికా సంఘం ప్రస్తావించింది. పట్టాదారు పాసు పుస్తకాలున్న రైతులు తమ భూముల్ని కౌలుకు ఇచ్చినా ఇతర అవసరాలకు పంట రుణాలు తీసుకుంటున్నారు. ఫలితంగా కౌలు రైతుకు అప్పులు దొరక్క అధిక వడ్డీలకు రుణాలు తెచ్చి నష్టపోతున్నారు. పంట సాగు చేయని భూయజమానులను గుర్తించి వారికి రుణాలు నిలిపివేయాల్సిన అవసరాన్ని విధాన నిర్ణేతలు పట్టించుకోవటం లేదు. ఇదే రుణ సమస్యలకు హేతువవుతోంది.
ఇన్నాళ్ళూ పంట రుణాలు అందటం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోకుండా తామే రైతులకు విరివిగా రుణాలు అందిస్తున్నామని చెబుతున్న పాలకులు ప్రణాళికా సంఘం చెబుతున్న వాస్తవాలపై ఏమంటారో..! రైతుల కష్టాలన్నింటికీ రుణాలు దొరక్కపోవడమే ప్రధాన కారణమని తెలిసినా పదే పదే అవే తప్పులు చేస్తున్న విధాన నిర్ణేతలు వ్యవస్థాగతంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి సరిదిద్దాల్సిన అవసరముంది. పట్టించుకోవాల్సిన ప్రభుత్వానికే రైతుల బాగోగులు పట్టకపోతే బడుగు రైతుకు ఇంకెవరు దిక్కు..?

No comments: