Pages

Saturday 20 August 2011

సేద్యం గిట్టుబాటు కాకే పంటవిరామం: శాస్త్రవేత్తలు

                                                                                                       
వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదని ఇన్నాళ్ళూ రైతులు నెత్తీ నోరూ కొట్టుకుంటున్న విషయాన్ని తాజాగా శాస్త్రవేత్తలు సైతం అంగీకరించారు. గడచిన నాలుగేళ్ళలో సాగు వ్యయం రెట్టింపైన ఫలితంగా రైతులకు సేద్యం గిట్టుబాటు కావడం గగనమవుతోందని వారి అధ్యయనంలో తేలింది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న వరి పరిశోధనా సంచలనాలయం (డి.ఆర్.ఆర్), మెట్ట పంటల వ్యవసాయ పరిశోధనా సంస్థ (క్రీడా)కు చెందిన కొందరు ముఖ్య శాస్త్రవేత్తలు ఒక బృందంగా తూర్పు గోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించి రైతులతో మాట్లాడి వాస్తవాలను సేకరించారు. నీటి విడుదలలో ఆలస్యం కారణంగా వరి నాట్లు తీవ్ర జాప్యమై దిగుబడులు పడిపోతుండటం, ధాన్యం కొనుగోలు విధానాలు సక్రమంగా లేకపోవడం, ఖర్చులకు తగ్గ గిట్టుబాటు ధరలు లబించకపోవడం, గోదాముల సదుపాయం లోపించడం, తుపాన్లు వచ్చిన సందర్భాల్లో సకాలంలో రైతులకు బీమా పరిహారం అందించకపోవడం, కూలీల కొరత, ఎరువుల ధరలు భారీగా పెరగడం.... ఇత్యాది కారణాలతో రైతుకు సేద్యం గిట్టుబాటు కావడం లేదని శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో పేర్కొన్నారు. ఈ సమస్యలకు తగిన పరిష్కారాలను ప్రభుత్వం చూపించగలిగితే రైతుల పరిస్థితి మెరుగు పడుతుందని వారు చెప్పారు. ఈ కారణంగానే కోనసీమ రైతులు పంట విరామం ప్రకటించాల్సి వచ్చిందని ఈ అధ్యయనంలో తేలింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే రైతులు దయనీయ స్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది కావున పాలకులు వాస్తవాలు గుర్తెరిగి దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిందిగా నా మనవి.

1 comment:

చిలమకూరు విజయమోహన్ said...

మన మనవిని వాళ్ళు వింటారంటారా? మేము ఇలా నష్టాలు భరించలేకే వేరుశనగ సాగును పూర్తిగా వదిలేశాము.