ఒక్కరుగా పొందలేనిది సమష్టిగా సాధించగలమనే సహకార సూత్రం ఆధారంగా ఏర్పడుతున్నవే నేటి రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్.పి.ఓ)లు. విత్తనాలు, ఎరువులు, పంట రుణాలు పనిముట్లు, యంత్రాలు సహా వ్యవసాయ ఉత్పాదకాలను నేరుగా వాటిని ఉత్పత్తి చేసే సంస్ధల నుంచి నాణ్యమైనవి పొందడం వల్ల సేద్యంలో సంభవించే 20-30 శాతం పంట నష్టాలను కూడా నివారించుకోవచ్చు. పైగా ఈ సంఘాలకు బ్యాంకర్లు నేరుగా రుణాలందిస్తే వాటి వసూలు కూడా నూరు శాతం ఉంటుంది. ఎఫ్.పి.ఓల ఏర్పాటుతో రైతుల మధ్య సంఘటిత్వం ఉండి మంచి ధరకు పంటను సమష్టిగా నేరుగా ఎగుమతిదారులకు విక్రయించుకోగలడం, ఉత్పత్తికి ప్రాసెసింగ్ చేసుకోవడం వంటి ఆలోచనలు కార్యరూపం దాల్చే అవకాశముంది. గత పదేళ్లుగా వీటి ఏర్పాటుకు నా ప్రతి వ్యాసంలో రైతులు ఇటువంటి సంఘాలుగా ఏర్పడితే వచ్చే ప్రయోజనాల గురించి చెబుతూ వస్తున్నా.
మిత్రుడు వంశీకృష్ణ వాసిరెడ్డి ఎఫ్.పి.ఓ ఏర్పాటు చేస్తున్నా అన్నా అనగానే ఎంతో సంతోషించాను. కొంత కాలంగా ఈ విషయంలో ఎంతో పురోగతి సాధించి పున్నవల్లి (ఎన్టీఆర్ జిల్లా నందిగామ దగ్గర) చుట్టుపక్కల గ్రామాల రైతులకు తన ఆలోచనలు చెప్పి "పున్నవల్లి రైతు ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్" ప్రారంభోత్సవానికి రేపు శ్రీకారం చుట్టాడు. తనకు విజయోస్తు. మిత్రులు సిబిఐ విశ్రాంత జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ గారు దీన్ని ప్రారంభించనున్న శుభసందర్భంలో వంశీ బృందానికి నా హార్ధిక శుభాకాంక్షలు.