Pages

Thursday 18 August 2011

రైతులు బిచ్చగాళ్లా....?

                                                    
పంటవిరామం పై చర్చిద్దాం రమ్మని రైతుల్ని హైదరాబాద్ కు పిలిపించి ఎలాంటి హామీలు ఇవ్వని ప్రభుత్వ తీరును కోనసీమ అన్నదాతలు తీవ్రంగా నిరసించారు. రైతులతో ముఖ్యమంత్రి, మంత్రులు నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పందించిన తీరు సరిగా లేదని, మే లో పంట విరామం ప్రకటిస్తే సర్కారు ఇప్పుడు స్పందించి చర్చల పేరిట పిలిపించి ఎలాంటి హామీలు ఇవ్వకపోవటం బాధించిందన్నారు.  పైగా వరి పంట ఎలా పండించాలో తమకు శాస్త్రవేత్తలతో  సూచనలు ఇచ్చేందుకు ప్రయత్నించటం పై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్వింటా ధాన్యానికి తక్షణం రూ.400 ప్రకటించాలన్న రైతుల వినతిపై ముఖ్యమంత్రి ఎలాంటి హామీ ఇవ్వలేదు. మోహన్ కందా కమిటీ నివేదిక వచ్చాక అంటే నెల రోజుల తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించడాన్ని రైతులు ఎద్దేవా చేశారు. రైతుల సమస్యలు కళ్ళకు కడుతుంటే ఇలా కాలయాపన చేయడం పట్ల రైతాంగం ఆగ్రహించింది. పంట విరామానికి దారితీసిన పరిస్థితులు, అందులో ధాన్యం కొనుగోళ్ళు, మార్కెటింగ్ శాఖలకు సంబంధించిన అధికారులు ఎవరూ ఇందులో పాల్గొనకపోవడంలోనే ప్రభుత్వ చిత్తశుద్ది ఏపాటిదో తెలుస్తున్నదని రైతులు ఆరోపించారు. పంట విరామం ప్రకటించిన రైతులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తారని ఎదురు చూసిన రైతులకు తీవ నిరాశ తప్పలేదు. ముఖ్యమంత్రి తో చర్చల అనంతరం నాతో మాట్లాడిన పలువురు రైతు నేతలు రైతుల్ని బిచ్చగాళ్ళుగా భావిస్తున్న పాలకుల కళ్ళు తెరిపిస్తామన్నారు. ఇదిలా ఉండగా పంట విరామం రాష్ట్రంలోని కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. తాజాగా కర్నూల్ జిల్లాలోనూ పలు మండలాల రైతులు వరి పంటకు విరామం ప్రకటించడం గమనార్హం. ఉద్యమం మరింతగా ముదరక ముందే సర్కారు కళ్ళు తెరవటం ముఖ్యం.

1 comment:

k.venkatesh said...

ఆడపిల్ల అశ్రువులు ఇంటికి అరిష్టం..........
రైతుల కనీళ్ళు దేశానికే దారిద్ర్యం........... మన నాయకులకు ఎప్పుడు తెలుస్తుందో............