Pages

Saturday 13 August 2011

నేడు పద్మశ్రీ ఐ.వి.సుబ్బారావు వర్ధంతి


                                                                         
భవిష్యత్తులో మంచి వ్యవసాయ జర్నలిస్టుగా ఎదిగి పేరు తెచ్చుకుంటావని నన్ను మనస్పూర్తిగా ఆశీర్వదించిన ఆ ఆత్మీయుడు గతించి నేటికి ఏడాది. ప్రముఖ వ్యవసాయ  శాస్రవేత్తగా దేశ ప్రజలకు, రైతు సోదరులకు సుపరిచితుడైన పద్మశ్రీ ఈడ్పుగంటి వెంకట సుబ్బారావు (ఐ.వి. సుబ్బారావు) గతేడాది ఆగష్టు 14 న పరమపదించిన సంగతి తెలిసిందే. నిరాడంబరుడు, సహృదయుడు, సౌమ్యుడు అయిన శ్రీ సుబ్బారావు  గారు ఆచార్య ఎన్.జి. రంగా  వ్యవసాయ  విశ్వవిద్యాలయం ఉపకులపతిగా వరుసగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించి ఆ  పదవికే వన్నె తెచ్చారు. నేను ఆయన శిష్యుడిని కాకపోయినా వ్యవసాయ జర్నలిస్టుగా ఎదిగేందుకు నాకెంతో తోడ్పడ్డారు. వారు  అభిమానించే తెలుగు జర్నలిస్టుల్లో నేనొకరిని కావడం నా అదృష్టం. వారి అభిమానం నాపై అంతగా ఉండేది మరి. వ్యవసాయ జర్నలిస్టుగా నన్ను తీర్చిదిద్దిన వారిలో శ్రీసుబ్బారావు,  శ్రీఆలపాటి సత్యనారాయణలు ముఖ్యులు.  అంతిమ ఘడియల్లో పరామర్సించేందుకు వెళ్ళినప్పుడు వారు నాతొ మాట్లాడిన జ్ఞాపకాలింకా నా స్మృతి  పథంలో పదిలంగా ఉన్నాయి.  పశ్చిమ గోదావరి జిల్లా పసలపూడిలో రైతు కుటుంబంలో జన్మించిన శ్రీసుబ్బారావు గారి కృషి వల్ల  రంగా వర్సిటీకి అంతర్జాతీయ ఖ్యాతి లబించింది. అఖిల భారత సైన్సు కాంగ్రెస్ అధ్యక్షులుగా వారందించిన సేవలు నిరుపమానం. 
          వారి వర్ధంతిని పురస్కరించుకుని శ్రీఐ.వి. సుబ్బారావు స్మారక కమిటీ వారి సహకారంతో రైతునేస్తం వ్యవసాయ మాస పత్రిక తన 7వ వార్షికోత్సవం సందర్భంగా వ్యవసాయ  జర్నలిస్టులు,  శాస్రవేత్తలు, ఉత్తమ రైతులకు అవార్డులు ప్రకటించింది. రైతుల  సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి ఆర్టికల్స్ రాస్తూ వాటి పరిష్కారానికి నా వంతు చిరు ప్రయత్నం చేస్తున్నందుకు గుర్తింపుగా ఎలక్ట్రానిక్ మీడియా విభాగంలో నాకు అవార్డు ప్రకటించినందుకు రైతునేస్తం పత్రిక వారికి నా ధన్యవాదములు. ఇది నాకొక మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. 18 న హైదరాబాద్  రెడ్ హిల్స్ లోని  FAAPCCI  లో అవార్డుల బహుకరణ సభ ఉంటుందని రైతునేస్తం ఎడిటర్ శ్రీ వెంకటేశ్వర రావు ఒక ప్రకటనలో తెలిపారు. గురుతుల్యులు శ్రీ సుబ్బారావు గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.  వారే లోకంలో ఉన్నా మా మనసుల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారు.

No comments: