Pages

Saturday 6 August 2011

యూరియాపై నియంత్రణ ఎత్తివేత?

                                                                                   
దేశంలో పెట్రోలు ధరలు పెరిగిన వెంటనే తమ ఉత్పత్తుల ధరల్ని ఇష్టానుసారం పెంచే కంపెనీల కున్న  స్వేచ్చ రైతులకు లేదు. ఉత్పత్తి చేసే వారికే ధర నిర్ణయించే అధికారం పారిశ్రామికులకు ఉన్నట్టే రైతులకు ఆ హక్కు లేకపోవడం వల్ల అన్నదాతలు కుదేలవుతున్నారు. తాజాగా కేంద్రం యూరియా ఎరువులపై ఇన్నాళ్ళుగా ఉన్న నియంత్రణను ఎత్తివేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఫలితంగా ఆంధ్ర ప్రదేశ్ రైతులపై దాదాపు 250 కోట్ల రూపాయల భారం పడనుంది. ఇప్పటికే డి.ఎ.పి., కాంప్లెక్స్ ఎరువుల ధరలను పెంచిన కంపెనీలకు ఈ నిర్ణయంతో అడ్డూ అదుపూ ఉండదు. ఒక వైపు అన్ని రకాల సేద్య ఖర్చులు పెరిగి వ్యవసాయం గిట్టుబాటు కాకా రైతులు తల్లడిల్లుతుంటే కేంద్రం రైతులపై ఎప్పటికప్పుడు మోయలేని భారం మోపుతూ రైతుల పరిస్థితిని అంతకంతకూ దిగజారుస్తోంది. యూరియా ధర తక్కువగా ఉండటం వాళ్ళ రైతులు ఎక్కువగా వాడేస్తున్నారని, ధరలు పెంచుతామని కంపెనీలు కేంద్రానికి పదే పదే చేసిన వినతులకు కేంద్రం వెంటనే స్పందించి ఈ నిర్ణయం తీసుకుంది. మద్దతు ధరలు పెంచాలని కేంద్రాన్ని రైతులు వేడుకుంటున్నా కనికరించని పాలకులు పరిశ్రమలపై మాత్రం దయ చూపించడం గమనార్హం. కంపెనీల వినతికి తోడు  యూరియాపై  ఇస్తున్న  రాయితీని తగ్గించుకునేందుకే కేంద్రం ఈ నిర్ణయానికి తెగబడినట్టు తెలుస్తోంది.
                                                                         
ఒక వైపు అంతర్జాతీయ మార్కెట్ లో యూరియా ధరలు పెరగటం వల్ల రైతులకు రాయితీ పెంచాల్సిన కేంద్రం ఇలా రైతు వ్యతిరేక చర్యలు తీసుకోవడంతో అన్నదాతల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. పదే పదే అవే తప్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం రైతుల పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తుండటం దేశ భవిష్యత్ రీత్యా క్షేమకరం కాదని గుర్తించాలి.

No comments: