Pages

Friday 5 August 2011

భూసేకరణ-సుప్రీంకోర్టు చివాట్లు

                                                        
పరిశ్రమలు, పట్టణీకరణ, గృహసముదాయాలు తదితరాల పేరిట బడుగుల భూముల్ని హస్తగతం చేసుకునే కుట్రల్ని నిన్న అత్యున్నత నాయస్థానం కడిగి వేయటం ఒక శుభపరిణామం. సెజ్ ల పేరిట అధికారాన్ని అడ్డుపెట్టుకొని కొందరు రాజకీయ నాయకులు చేస్తున్న దురాగతాలకు ఇది చెంప పెట్టు. ఆంధ్ర ప్రదేశ్ తో సహా దేశంలోని ఎన్నో రాష్ట్రాల్లో  సెజ్ ల  కోసం అక్రమంగా నోటీసులు ఇచ్చి పేదల జీవనాధారమైన పంట భూముల్ని లాగేసుకునే ఇటువంటి దుర్మార్గాన్ని ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే. తాజాగా ఉత్తరప్రదేశ్ లోని హాపూర్ జిల్లా రైతుల నుంచి బలవంతంగా భూసేకరణలు చేయడంపై సుప్రీంకోర్ట్ ప్రభుత్వ చర్యను తూర్పార పట్టింది. "సామాన్యుల  సంక్షేమం పట్టని కొందరు బుర్ర లేని వ్యక్తులు భూసేకరణ చట్టాన్ని రూపొందించారని, అది మోసకారి చట్టమని, కండబలం కలిగిన వ్యక్తులే ప్రైవేటు భూముల్ని స్వాధీనం చేసుకుంటారని, దీనివల్ల భూముల ధరలకు రెక్కలోస్తాయని కోర్టు వ్యాఖ్యానించింది. పోలేపల్లి, సోంపేట, కాకరాపల్లి, సత్యవీడు .... ఇలా మన రాష్ట్రంలో పచ్చని భూముల్లో సెజ్ ల మంటలు ఎగసిపడినా పాలకులు కరుణించలేదు. 
ఇప్పటికే దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ పేరిట లక్షలాది హెక్టార్లలో పంట భూములు సాగుకు నోచుకోక వృధాగా ఉండటంవల్ల దేశంలో ఆహారోత్పత్తి ఆశించిన రీతిలో పెరగటం లేదు. ఆహార భద్రత అంశాన్ని పక్కన పెడితే పేదల భూములతో స్వార్ధ రాజకీయం ఎలా ఆటలు ఆడుతుందో ఆంధ్ర ప్రదేశ్ లో మనం స్వయంగా చూశాం. తమకు జీవనాధారమైన భూముల విషయంలో ప్రభుత్వాలే భూసేకరణల పేరిట మోసం చేస్తాయని ఊహించని నిరుపేదలు ఎందరో నేడు రోడ్డున పడుతున్నారు. వీటి వెనుక ఉన్న కుట్రలు తెలియక సర్వస్వం కోల్పోయిన నిర్భాగ్యులు చివరికి ఆత్మహత్యలకు సైతం పాల్పడుతుండటం విషాదం. అక్రమార్కుల కుట్రల్ని వెలికి తీస్తున్న మీడియా కధనాలనే సుమోటో గా తీసుకుని కనీసం కోర్టులైనా ఈ దుర్మార్గాలకు అడ్డుకట్ట వేయాలని కోరుకుందాం.

No comments: