Pages

Thursday 4 August 2011

పంట విరామంపై రైతుల "ప్రతిధ్వని"

                                                                            
రాష్ట్రంలోని తూర్పు గోదావరి సహా పలు జిల్లాల రైతులు పంట విరామం దిశగా ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఖరీఫ్ లో పంట విరామం పాటించాలని రైతులు  తీసుకున్న నిర్ణయానికి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోందని రైతు సంఘాల నాయకులు అంటున్నారు. రాత్రి 9 గంటలకు ఈటీవి 2 ప్రతిధ్వనిలో పంట విరామం పై మంచి చర్చ వచ్చింది. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరకే కొనుగోళ్ళు సాగినా ప్రతి క్వింటా పైనా రైతుకు 700 రూపాయలు నష్టపోతున్నారని చర్చలో పాల్గొన్న రైతు నేత చెంగల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇన్నాళ్ళకు రైతు చేతికి ఒక ఆయుధం దొరికిందని, దేశవ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని వారన్నారు. రైతుల స్థితిగతులపై  నియమించిన పలు కమిషన్లు చేసిన విలువైన సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం బుట్ట దాఖలు చేస్తుండటం వల్లనే ఈ  దుస్థితి దాపురించినదని వక్తలు  అభిప్రాయపడ్డారు. వ్యవసాయరంగంలో సమూల మార్పులు సూచించిన వర్కింగ్ గ్రూప్ నివేదికను ప్రభుత్వం గుర్తించి అమలు  చేయాలని నిపుణులు కోరారు. 
                                                            
            ఇదిలా ఉండగా ఆహార భద్రతపై పంట విరామం తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో ఉన్న 90 శాతం చిన్న, సన్నకారు రైతుల సంక్షేమాన్ని విస్మరిస్తే దాని ప్రభావం దేశ ఆర్ధిక వ్యవస్థపై పడుతుందని వారు హెచ్చరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే సాగుదార్ల ప్రాధాన్యం గుర్తించి ప్రభుత్వాలే రైతుల కాళ్ళ వద్దకు వచ్చే పరిస్థితి తీసుకొస్తామని, ఈ దిశగా దేశంలో బలమైన రైతు ఉద్యమం నిర్మిస్తామని రైతు నేతలు వక్కాణించారు. జాతీయ రైతు సంఘాల సమాఖ్య గౌరవాధ్యక్షుడు చెంగల్ రెడ్డి, తెలుగుదేశం నేత కోడెల శివప్రసాదరావు, రంగా విశ్వవిద్యాలయం మాజీ రిజిస్త్రార్ జలపతిరావు, పి.సి.సి. కిసాన్ సెల్ నేత కోదండ రెడ్డి ఈ చర్చలో పాల్గొన్నారు. అధికార పక్షంలో ఉండి కుడా కోదండ రెడ్డి గారు రైతుల పట్ల సానుభూతితో మాట్లాడడం బాగుంది. 
             రైతులు పంట విరామం విషయంలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం గౌరవించి వారిని అన్ని  విధాలా ఆదుకుంటుందని ఆశిద్దాం.

No comments: