Pages

Thursday 2 February 2012

బాధ్యతల నుంచి వైదొలగటమే జలవిధానమా...?

                                                         
భవిష్యత్తులో ప్రతి నీటి బొట్టు వినియోగానికి లెక్కలు చెప్పాలని మంగళవారం విడుదలైన జాతీయ జలవిధానం ముసాయిదా నిర్దేశిస్తోంది. ప్రస్తుతం సేవలు సమకూరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు నెమ్మదిగా సేవలు నియంత్రించే సంస్థలుగా మారాలంటోంది. ఇప్పటికే తక్కువగా ఉన్న జల విద్యుత్ ధరలను పునః సమీక్షించాలంటోంది. నీటి సరఫరాలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల వ్యత్యాసాన్ని తగ్గించాలన్నది ఈ ముసాయిదాలోని మరో కీలకాంశం. రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారానికి పనిచేస్తున్న పలు   ట్రైబ్యునళ్ళ స్థానంలో శాశ్వత ప్రాతిపదికన ఒకే ట్రైబ్యునల్ ఉండాలని ముసాయిదా ప్రతిపాదించింది. ఫెడరల్ విధానాన్ని తుంగలో  తొక్కి దేశం మొత్తం ఒకే జలవిధానం అంటూ సరళీకరణ ఆర్ధిక విధానాలను మరింతగా రాష్ట్రాలపై రుద్డటమే లోగుట్టనే విమర్శలున్నాయి. కేంద్ర ప్రణాలికా సంఘం ఉచిత విద్యుత్తుపై ఆక్రోశం వెళ్ళగక్కిన నేపధ్యంలో కొత్త జలవిధానం అమలైతే రాష్ట్ర రైతులకు ఉచిత విధ్యుత్ అందే అవకాశం ఉండకపోవచ్చు. అలానే భూగర్భ జలాలకు సెస్సు వసూలు చేయాలని పేర్కొన్న దృష్ట్యా కేంద్రం ఆమ్ ఆద్మీని కాల్చుకుతినే ఏ అవకాశాన్ని వదిలిపెట్టబోదని స్పష్టమవుతోంది.
                                                             
అలానే నీటిని ప్రైవేటీకరిస్తే ప్రతి చుక్క నీటిని లెక్కగట్టి ధరలు నిర్ణయించి రైతులు, ఇతర వినియోగదారుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేసే అవకాశముంది. ఒక్కమాటలో చెప్పాలంటే నీటి పంపిణీ బాధ్యతల నుంచి ప్రభుత్వం పూర్తిగా వైదొలగనుంది. నీటిని అందించలేని ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అర్హత లేదని గతంలో సుప్రీంకోర్ట్ చేసిన వ్యాఖ్యలతోనైనా పాలకులకు జ్ఞానోదయం కాకపోవడం నేటి విషాదం.  మొత్తానికి నీటిని ఆర్ధిక వస్తువుగా గుర్తించి సమర్ధ వినియోగానికి పెద్ద పీత వేయాలన్నదే ఈ జాతీయ జల విధానం అసలు లక్ష్యంగా కనిపిస్తోంది. 

No comments: