Pages

Monday 16 January 2012

"ఉచిత" డ్రామాలొద్దు

                                                            
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ములాయం కూడా ఉచిత హామీలు గుప్పిస్తున్నారు. ఉచిత విద్యుత్, రుణాల మాఫీతో రైతుల్ని, చేనేత వర్గాలను బుట్టలో వేసుకోవాలని తపిస్తున్నారు. భారతీయ రైతులు ఆరుగాలం కష్టపడి సంపాదిస్తారే తప్ప రాజకీయ నాయకుల్లా తేరగా వచ్చే వాటికి ఆశపడరు. ఓట్ల కోసం అడ్డమైన గడ్డీ కరిచే నేతలు రైతుల కోసం ఉచిత వాగ్దానాలను ఇవ్వటం కంటే రైతులు ఎందుకు అప్పుల పాలవుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వ్యవసాయం ఎందుకు గిట్టుబాటు కావడం లేదు..? పంట పండించేందుకు అవసరమయ్యే ఉత్పాదకాల ధరలు ఏ స్థాయిలో ఉన్నాయి..? అసలవి అందుబాటులో ఉన్నాయా..? గిరాకీ సరఫరాకు తగిన రీతిలో ఉత్పత్తి వస్తోందా.. లేక ఉత్పత్తి పెరిగినప్పుడు ధరలు పతనమై రైతులు నష్టపోతున్నారా.. అటువంటి సందర్భాల్లో మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం రైతుల్ని ఏ మేరకు ఆదుకుంటోంది  ..? అలానే ఉత్పత్తికి విలువ జోడించే పరిశ్రమలు ఏర్పాటు చేసి రైతులకు ఆదాయం పెంచుకునేందుకు అవకాశం ఏ మేరకు కల్పిస్తోంది..?  దేశంలో కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న వ్యవసాయ దిగుమతుల పై సుంకాలు విధించి దేశీయ రైతులకు తగిన రక్షణలు కల్పిస్తోందా...?  తద్వారా మన రైతులకు మంచి ధరలు వచ్చేలా చూస్తోందా... ?  ఇక్కడ ఒక్క ములాయం గురించే కాదు ఉచిత వాగ్దానాలతో రైతుల్ని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి వారి పరిస్థితిని దిగజార్చే ప్రతి పార్టీకీ., ప్రతి నాయకునికీ ఈ విమర్శ వర్తిస్తుంది. నేతలూ గుర్తుంచుకోండి... మీ ఉచిత వాగ్దానాలతో ప్రజల్ని సోమరుల్లాగా మార్చకండి. ఆర్ధిక వ్యవస్థను నాశనం చేయకండి. మన నేతలు ముఖ్యంగా అధికారంలో ఉన్నవారు పైన పేర్కొన్న వన్నీ చేస్తే ఉచిత వాగ్దానాలు ఇచ్చి రైతుల్ని మోసగించాల్సిన అవసరం లేదు. వారి కష్టానికి ఫలితాన్నివ్వండి చాలు. రైతుకు అదే పదివేలు.   

1 comment:

Praveen Mandangi said...

మధ్యవర్తి రైతుల దగ్గర ఒక అరటి గెలని డబ్బై రూపాయలకి కొని దాన్ని మార్కెట్‌లో మూడు వందల రూపాయలకి అమ్ముకునే పరిస్థితి ఉన్నప్పుడు రైతుల కంటే వ్యాపారులే చాలా ధనవంతులుగా ఉంటారు. ఈ స్థితిలో ఎన్ని ఉచిత పథకాలు పెట్టినా రైతుల ఆర్థిక పరిస్థితిలో ఎలాంటి మార్పూ రాదు.