Pages

Friday 31 August 2012

మట్టి గణేష్ విగ్రహాలనే పెడదాం!

                                                    
రాష్ట్రంలో ఏటా వినాయక చవితికి ఉపయోగిస్తున్న విగ్రహాలు 90 నుంచి 93 శాతం ప్లాస్టర్ అఫ్ ప్యారిస్ తో రూపొందించినవే కావటం గమనార్హం. ఈ సంఖ్యను గణనీయంగా తగ్గించి పర్యావరణాన్ని కాపాడటం మనందరి బాధ్యత. మట్టి విగ్రహాలను వినియోగించడం ద్వారా కాలుష్యాన్ని బాగా తగ్గించవచ్చు. గత రెండేళ్లుగా ఈ దిశగా చేపడుతున్న చర్యల వల్ల ప్రజల్లో ఎంతో చైతన్యం వచ్చింది. నగర, పురపాలక సంస్థలు సైతం తమ వంతు బాధ్యతగా మట్టి విగ్రహాల ఏర్పాటుకు ప్రోత్సాహం అందిస్తున్నాయి. కొందరు వ్యక్తులు, "సేవ్" వంటి కొన్ని స్వచ్చంద సంస్థలు ఈ దిశగా మట్టి విగ్రహాలను తయారు చేసి చిన్నవి ఉచితంగా, పెద్దవి కొద్దిపాటి ధరలకు అందిస్తున్నాయి. ఒకరిని చూసి మరొకరు పోటీ పడకుండా రసాయనాలతో కూడిన రంగులు వాడిన రంగు రంగుల విగ్రహాలను ఏర్పాటు చేయకుండా ఈ ఏడాది మన బాధ్యతను మనం నిర్వర్తిద్దాం.  ఈ ఏడాది హైదరాబాద్ లో దాదాపు 15 వేల మట్టి విగ్రహాలను సరఫరా చేయించేందుకు నగర పాలక సంస్థ ఏర్పాట్లు చేస్తోంది.  ఈ దిశగా 100 స్కూళ్లలో చైతన్యం తీసుకొచ్చి విద్యార్ధుల్లో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తోంది. ఇంటింటా ఈ వినాయక చవితిని పర్యావరణ పరిరక్షణకు అంకితం చేద్దాం...  మట్టి వినాయకులకు జై కొడదాం.

Thursday 23 August 2012

ఛీ ఛీ సిగ్గులేని కేంద్ర మంత్రి

                                                            
భారత దేశపు అత్యంత చెత్త వ్యవసాయ మంత్రి శరద్ పవార్ మరోసారి తన బుద్దిని బయట పెట్టారు. విత్తన చట్టంలో తీసుకురావాల్సిన సవరణల గురించి మాట్లాడేందుకు అఖిల పక్షంతో డిల్లీకి వెళ్ళిన కన్నా బృందంపై రుసరుసలాడి తన అసహనాన్ని వెళ్లగక్కారు. మంత్రి కన్నా దీన్ని సరదాగానే తీసుకున్నా వారితో వెళ్ళిన రైతు నాయకులతో నేను మాట్లాడినప్పుడు.., పవార్ తమను ఎందుకొచ్చారు అన్నట్టు చూసారని., కనీసం అతిదులమన్న గౌరవం కూడా ఇవ్వలేదని చెప్పారు. విత్తన చట్టంలో బహుళ జాతి సంస్థలకు అనుకూలంగా ఉన్న పలు అంశాలపై దేశవ్యాప్తంగా రైతుల నుంచి నిరసనలు వ్యక్తమైనా., కార్పొరేటే సంస్థలకు బాకా వూదటంలో నేర్పరి అయిన పవార్, దేశీయ రైతుల ఇబ్బందుల గురించి పట్టించుకుంటాడని ఆశించడం అత్యాశే. విత్తన చట్టంలో ఇటువంటి సవరణలు చేస్తే కార్పొరేట్, ఎంఎన్ సీలు నష్టపోతాయని  పవార్ కి బాగా తెలుసు. వీళ్ళు లాభ పడేలా చేయాలనేదే ఆయన ఉద్దేశమని యావత్ దేశానికి తెలిసినా పాపం మన మౌన రుషి మన్మోహన్ సర్కారుకు తెలియదు. భారతీయ రైతుల్ని రక్షించాలంటే స్వతంత్ర భారత చెత్త వ్యవసాయ మంత్రి పవార్ ను క్రికెట్ కు పరిమితం చేయండి మహాప్రభో!

Monday 20 August 2012

రాష్ట్ర రైతుల్ల పట్ల కేంద్రం సవతి ప్రేమ

దేశంలో నెలకొన్న కరవు పరిస్థితుల వల్ల ఆహారోత్పత్తి కుంటుపడి తద్వారా ధరలు పెరిగే అవకాశం ఉంది. అంతకు మించి సేద్యంలో మరిన్ని నష్టాలకు రైతులు సిద్దపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కరవు సాయం విషయంలో కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్ పవార్ సొంత రాష్ట్రం పట్ల చూపుతున్న మమకారం, దక్షిణాది  రాష్ట్రాల విషయంలో చూపుతున్న సవతి ప్రేమ కేంద్రంలోని యుపీఏ ప్రభుత్వానికి మునుముందు సమస్యలు తెచ్చిపెట్టనుంది. కరవు కష్టాలు ఎదుర్కొంటున్న రాష్ట్ర రైతుల విషయంలో ఏమీ మాట్లాడని మన ఎంపీలు., సంకీర్ణ ప్రభుత్వంలో కొందరు మిత్రపక్ష మంత్రులు వ్యవహరిస్తున్న తీరును గుడ్లప్పగించి చూస్తుండటం విచారకరం. ఏదేమైనా అంతిమంగా నష్టపోతున్న ఆంధ్ర ప్రదేశ్ రైతుల పరిస్థితి., కరవు వల్ల, ఆహార భద్రతా సమస్య తదితర అంశాలపై నేను రాసిన వ్యాసాన్ని ఈ రోజు 'ఈనాడు' ప్రచురించింది. మీ కోసం ఇక్కడ వ్యాసాన్ని అప్ లోడ్ చేస్తున్నాను.