ఆంధ్రప్రదేశ్ లో పంటల పరిస్థితి క్రమంగా మెరుగుపడుతున్నా రైతుల స్థితిగతులు మాత్రం మారడం లేదు. సీజన్ సగటుతో పోల్చితే ఇప్పటికీ 5 లక్షల హెక్టార్లలో పంటలు వేయడం ఆలస్యమైంది. ఇటీవల ద్రోణి ప్రభావంతో కురుస్తున్న వర్షాలు పరిస్థితిని కొంత మెరుగుపరచినా నాట్లు ఆలస్యమవడం మాత్రం దిగుబడులపై ప్రభావం చూపనుంది. పంటల సాగు పరిస్థితి ఇలా ఉంటే., రైతులకు అప్పు పుట్టక నానా అగచాట్లకు గురవుతున్నాడు. పంట పెట్టుబడుల కోసం రైతులు బ్యాంకర్ల ముందు దేహీ అంటూ చేయిచాచాల్సి వస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కౌలు రైతులకు పంట రుణాలు ఇస్తామని చెప్పి వారికి రుణ అర్హత కార్డులు అందిస్తున్నామని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ రుణాలు అందించలేదు సరికదా నేడు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకునే పరిస్థితి కల్పించింది. ఈ పరిణామంతో రైతుకు అప్పు పుట్టడం గగనమవుతోంది. ఎప్పటిలా అందిన చోటల్లా అప్పులు తెచ్చి పంటల సాగుకు దిగే రైతుకు ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఇబ్బంది పెట్టనున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు
నూటికి 40 శాతం రైతులకు కూడా పంట రుణాలు అందించలేకపోవడం నిజంగా ప్రభుత్వ వైఫల్యమే.
నూటికి ముప్పై శాతానికి కూడా పంట రుణాలు అందించలేకపోతున్న ప్రభుత్వ వైఖరితో రైతులు ఏటా నష్టపోవలసి వస్తోంది. బ్యాంకులు రైతు ప్రయోజనాలను పక్కనపెట్టి వాణిజ్య కార్యకలాపాలకు అధిక రుణాలు మంజూరు చేస్తున్నాయి. మొత్తం రుణాల్లో 18 శాతం రుణాలను వ్యవసాయానికి ఇవ్వాలని రిజర్వుబ్యాంకు ఆదేశించినా బ్యాంకులు పట్టించుకోవడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం సైతం పట్టనట్టు వ్యవహరిస్తుండటంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. అధిక వడ్డీలకు రుణాలు తేవాల్సి రావడంతో రైతుల నికరాదాయం తగ్గే సూచనలు ఉన్నాయి. ఈ పరిస్థితి నుంచి రైతుల్ని కాపాడాలంటే వారికి విరివిగా పంట రుణాలు మంజూరు చేయడం ఒక్కటే ప్రభుత్వం ముందున్న కర్తవ్యం.