Pages

Friday 27 January 2012

ఇన్నాళ్ళకు కరవు బృందం వస్తుందట!

                                                              
రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు ఏర్పడి రైతులు భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. సుమారు 34 .24 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. ఖరీఫ్ లో మొదలైన కరవు నేటికీ రబీ లోనూ కొనసాగుతుండటం రైతుల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. రైతుకు అంతకు మించిన విచారం ప్రభుత్వ సహాయ నిరాకరణ రూపంలోనూ ఎదురైంది. ఖరీఫ్ కరవు పరిస్థితులపై కేంద్రానికి నివేదించిన రాష్ట్రం తగిన సహాయాన్ని పొందటంలోనూ, స్వయంగా రైతులకు తానూ సహాయం చేయడంలోనూ విఫలమైంది. కరవు తీవ్రతను తెలుసుకునేందుకు, రైతులకు వాటిల్లిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం ఫిబ్రవరి 5 న రాష్ట్రంలో పర్యటించనుంది. కరువొచ్చిన ఆర్నెల్లకు కేంద్ర బృందం ఏం చూసి రైతుకు సహాయ పడుతుందో ఏలిన వారికే తెలియాలి. 
                                                                
గత కొన్నేళ్లుగా రైతుకు దెబ్బ మీద దెబ్బ తగులుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవడం మాని చేష్టలుడిగి చూస్తున్నాయి. కేంద్రం సైతం ఆంధ్ర ప్రదేశ్ పట్ల సవతి ప్రేమ చూపుతోంది. ఇటీవల "థానే" తుపాన్ దెబ్బ తగిలిన తమిళనాడుకు కేంద్రం తక్షణ సాయంగా రూ. 600 కోట్లు ప్రకటించింది. అటువంటి భారీ నష్టాలను ఇటీవలి  కాలంలో తరచుగా చవిచూసిన ఆంధ్ర ప్రదేశ్ విషయంలో కేంద్రం దారుణంగా వ్యవహరిస్తోంది. కోరిన సాయంతో పోల్చితే ముష్టి విదిల్చినట్టు నామమాత్రపు సాయం ప్రకటిస్తున్న కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ రైతుల జీవితాలతో ఆటలాడుతోంది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం సైతం రైతు శ్రేయాన్ని గాలికి వదిలేసింది. రైతాంగం ఇంత తీవ్ర కరవు కష్టాల్లో ఉండగా వారిని ఆదుకునేందుకు నోరు మెదపని మన ఎంపీలను ఏం చేయాలి...? రాజకీయాలు లేదా వారి సొంత ఆస్తులు పెంచుకోవడం తప్ప  వీరు ప్రజలకు చేస్తున్నదేమిటి..? వీరి నిర్లక్ష్యానికి తగిన జవాబు చెప్పేందుకు రైతులు సంసిద్ధం కావాలి. రైతులకు ఇచ్చే పరిహారంలోనూ వాటాలు పంచుకునే నీతిలేని నాయకులకు పార్టీలకు అతీతంగా రైతులు గట్టి జవాబు చెప్పాలి.
 

No comments: