Pages

Thursday 5 January 2012

రైతుల ఆత్మహత్యల్ని ఆపలేరా...?

                                         
రాష్ట్రంలో తూర్పు గోదావరి సహా పలు జిల్లాల రైతులు గత ఖరీఫ్ లో పంట విరామం ప్రకటించి ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేసినా పాలకులు ఈ విషయాన్ని తేలికగా తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. గత సెప్టెంబరు 17 వ తేదీన మోహన్ కందా కమిటీ నివేదికపై చర్చలు జరిపిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, కమిటీ సూచనల్లో చాలా వాటికి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. నాలుగు నెలలు పూర్తి కావస్తున్నా ఇవి అమలుకు నోచుకోకపోవడం రైతు శ్రేయం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న సంగతిని స్పష్టం చేస్తోంది. వీటికి తోడు దాదాపు 772 కి పైగా  కరవు మండలాలను ప్రకటించిన ప్రభుత్వం అందుకు తగిన కార్యాచరణను మాత్రం నేటికి ప్రకటించి అమలు చేయలేకపోయింది.  వ్యవసాయ వ్యవస్థ నాశన మవుతున్నా కొద్ది రోజులు గడిస్తే రైతులే ఆ విషయం పట్టించు కోరులే అన్న దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్న ప్రభుత్వం అందుకు తగిన మూల్యాన్ని చెల్లించుకుంటుంది. కనీసం తాను హామీ ఇచ్చిన వాటిని సైతం అమలు చేయకుండా పంట విరామం ప్రకటించిన రైతుల్ని ప్రభుత్వం అవమానపరుస్తోంది. తాము ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వం పట్టించుకొకపోవటాన్ని రైతులోకం తప్పుబడుతోంది.
                                                           
వరుసగా సీజన్ల తరబడి రైతులు నష్టాల పాలవుతున్నారు., ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టడం లేదు. గత మూడు నెలల్లో రాష్ట్రంలో వందకి పైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తాజాగా  థానే తుపాన్ వచ్చి దక్షిణ కోస్తా జిల్లాల రైతుల ఆశల్ని దెబ్బతీసింది. ప్రతి సీజన్లో ఏదో ఒక భారీ నష్టం రైతుల ఆశల్ని ఆవిరి చేస్తుంటే ఏ ధీమాతో రైతులు మరో పంట సాగుకు వెళ్ళే అవకాశముంది..? వరుస నష్టాలు రైతుల మనో ధైర్యాన్ని దెబ్బతీస్తాయి. అప్పులు పెరిగి వ్యవసాయంపై విరక్తిని పెంచుతాయి. అవి తీర్చే మార్గం లేక ఆత్మహత్యలకు పురికొల్పుతాయి. ఆదుకోవాల్సిన ప్రభుత్వాలే పట్టించుకోకపోతే రైతులు ఎవరిని ఆశ్రయిస్తారు...? రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నా పాలకులు దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడం దేనికి సంకేతం..? వ్యవసాయం కునారిల్లితే ఆర్ధిక ప్రగతి కుంటుపడుతుందన్న ఇంగిత జ్ఞానం కూడా లేని నేతల పాలనలో పాపం రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. ఇప్పటికైనా సేద్యరంగ మూలాలకు చికిత్స చేసి వ్యవసాయదారుల్ని కాపాడలేరా...?  పెరుగుతున్న రైతుల ఆత్మహత్యల్ని ఆపలేరా...? రాష్ట్రంలో కొంతకాలంగా రాజకీయాలు తప్ప మరో వ్యాపకం పట్టించుకోని నేతలు  తమను ఎన్నుకున్న ప్రజల గోడును ఇకనైనా పట్టించుకుంటారా అన్నదే ప్రశ్న!

No comments: