Pages

Friday 14 October 2011

మండుతున్న రైతు గుండెలు!

                                                         
తెలంగాణా లోని నిజామాబాద్ మినహా ఎనిమిది జిల్లాలకు తోడు తూర్పు గోదావరి, గుంటూరు, ప్రకాశం,కర్నూలు, అనంతపురం జిల్లాల్లో 20 నుంచి 59 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని వ్యవసాయశాఖ తాజా నివేదిక చెబుతోంది. తీవ్ర ఎండలు ప్రజలకు వేసవి తాపాన్ని రుచి చూపిస్తుంటే, ఇప్పటికే వేసిన పంటలు ఎండి పశువులకు గ్రాసంగా వాడాల్సి వస్తోంది. ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకు 701 .8 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, ఈ నెల 12 వ తేదీ నాటికి కేవలం రాష్ట్రంలో 556 మి. మీ. (21 శాతం తక్కువ) మాత్రమే వర్షం  కురిసింది. దాదాపు 450 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వరి, వేరుసెనగ,మొక్కజొన్న, పత్తి, తదితర పంటలు ఎండి రైతులు పంటల్ని తగులబెట్టుకోవాల్సి వస్తోంది. 
వర్షాభావ పరిస్థితులు వ్యవసాయాన్ని దెబ్బతీస్తుంటే, విద్యుత్ కోతలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. పంట కీలక దశలో ఉండగా వర్షాభావం రైతుల్ని తీవ్రంగా నష్టపరుస్తోంది. ప్రభుత్వ వైఖరి రైతుల్ని మరింత ఇబ్బందుల్లోకి నెట్టేలా ఉంది. రాష్ట్రంలో నెలకొన్న 'ప్రత్యేక' పరిస్థితులపై స్పందించడంలో విఫలమవుతున్న పాలకులు, తమ చేత కాని తనాన్ని రైతుల విషయంలోనూ నిరూపించు కుంటున్నారు. ఇప్పటికే ధర లేక, నిల్వ వసతులు లేక, ఎరువులు దొరక్క, వర్షాభావ పరిస్థితులతో తీవ్ర నిరాశలో ఉన్న రైతుల్ని సక్రమంగా విద్యుత్ సరఫరా ఇచ్చి ఆదుకోవడంలో ప్రభుత్వం పదే పదే విఫలమవడం రైతుల స్థితిని మరింత దుర్భరం చేస్తుండటం విషాదం.

No comments: